ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యమం వేదిక ‘ఎక్స్’లో చేసిన ఒక వివాదాస్పద పోస్టును తొలగించింది. ఆ పోస్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో ఆ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీని లక్ష్యంగా చేసుకుని ‘గాయబ్’ అంటూ ఒక పోస్టు చేసింది. అయితే, ఈ పోస్ట్ చేసిన కొద్ది సమయానికే పలువురి నుంచి, ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
ఈ పోస్టుపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ముస్లిం ఓటు బ్యాంకు కోసం ప్రధానిని కాంగ్రెస్ లక్ష్యంగా చేసుకుందని అధికార పార్టీ నేతలు ఆరోపించారు. బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ ‘పాకిస్థాన్ స్నేహితుడు’ అనే ట్యాగ్లైన్తో రాహుల్ గాంధీ పోలికతో ఒక పోస్టును పెట్టారు. అయితే ఆయన పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. తెలుపు రంగు టీషర్ట్, క్యాప్ ధరించిన ఒక వ్యక్తి చేతిలో కత్తి పట్టుకున్న ఫోటోను ‘ఎక్స్’ ఖాతాలో ఉంచారు.
విమర్శలు, వ్యతిరేకత అధికం కావడంతో కాంగ్రెస్ పార్టీ సదరు పోస్టును తమ ‘ఎక్స్’ ఖాతా నుంచి తొలగించింది. ప్రస్తుతం ఆ పోస్టు సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై అందుబాటులో లేదు.