హైదరాబాద్ నగరంలో 208 మంది పాకిస్థాన్ జాతీయులు నివసిస్తున్నారని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు. నగరంలో ఉన్న పాకిస్థాన్ జాతీయుల వీసాలన్నీ రద్దు అయ్యాయని వెల్లడించారు. ఈ నెల 27వ తేదీలోపు వారు ఈ ప్రాంతం నుంచి నిష్క్రమించాలని హెచ్చరించారు. అటారీ సరిహద్దు ఈ నెల 30వ తేదీ వరకు మాత్రమే తెరిచి ఉంటుందని పేర్కొన్నారు.
ఈ నెల 30వ తేదీ తర్వాత దేశంలో ఎవరైనా ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 27వ తేదీ నుంచి పాకిస్థాన్ వీసాలు పనిచేయవని స్పష్టం చేశారు.
వైద్య వీసా కలిగిన వారికి ఈ నెల 29 వరకు మాత్రమే గడువు ఉందని తెలియజేశారు. దీర్ఘకాలిక వీసా ఉన్నవారికి ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం ఆదేశాల మేరకు నగరంలోని పాకిస్థాన్ జాతీయులకు డీజీపీ ఈ హెచ్చరికలు జారీ చేశారు.