రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి రుణాల మంజూరు నిబంధనలపై ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. యూనిట్లను నాలుగు క్యాటగిరీలుగా విభజించి, రాయితీ నిధుల వాటాను భారీగా పెంచింది. గతంలో అమలు చేసిన స్వయం ఉపాధి పథకాల కన్నా మెరుగ్గా నిబంధనలు రూపొందించడంతోపాటు పకడ్బందీగా అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్చి 22న డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క సంక్షేమశాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో యూనిట్ల వ్యయం, రాయితీ వాటాను ఖరారు చేసి, ప్రకటన జారీ చేశారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఎవరైనా ఏప్రిల్ 5, 2025వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాదికి రాష్ట్రంలోని దాదాపు 5 లక్షల మంది యువతకు రూ.6 వేల కోట్ల ఖర్చుతో ప్రభుత్వం రాయితీ రుణాలను ఈ పథకం కింద మంజూరు చేయనుంది. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు అప్లికేషన్స్ వెరిఫికేషన్ కొనసాగుతుంది. లబ్ధిదారుల్లో అర్హులను ఎంపికచేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున అంటే జూన్ 2న లబ్ధిదారులకు సంబంధిత పత్రాలను అందజేస్తారు.