బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల గత రెండు రోజుల నుంచి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం (మార్చి 23) కూడా కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. ఇక హైదరాబాద్లో వచ్చే 24 గంటల్లో పలుచోట్ల పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. నిన్నమొన్నటి వరకు ఎండలతో హడలెత్తిపోయిన గ్రేటర్ వాసులు ద్రోణి ప్రభావంతో కొంత ఉపశమనం పొందారు.శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19.1 డిగ్రీలు, గాలిలో తేమ 48 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు.