ఉపాధ్యాయుల బదిలీల విషయంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా టీచర్ల సీనియారిటీ జాబితాలను రూపొందించాలని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యపై మంత్రి లోకేశ్ ఇవాళ సమీక్ష నిర్వహించారు.
జీవో 117కు ప్రత్యామ్నాయ వ్యవస్థపై తర్వలోనే ప్రజాప్రతినిధులకు వర్క్ షాప్ నిర్వహించి వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. త్వరలో చేపట్టనున్న డీఎస్సీ నిర్వహణ సన్నద్ధతపైనా సమావేశంలో కూలంకషంగా చర్చించారు.
జూనియర్ కాలేజీ గెస్ట్ ఫ్యాకల్టీల వేతనాల పెంపుపై త్వరలోనే సానుకూల నిర్ణయం
జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీల వేతనాలు పెంచాలనే డిమాండ్ పై సమావేశంలో చర్చ జరిగింది. దీనిపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారా లోకేశ్ తెలియజేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో నూతన సిలబస్ ను ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు.
విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే జూనియర్ లెక్చరర్ల బదిలీలు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఈ నెల 20వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కలిసి మంత్రి నారా లోకేశ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించనున్నారు.