ఇటీవల లైలా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమెడియన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణులను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. దాంతో వారు పృథ్వీని భారీ స్థాయిలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో, పృథ్వీ హైదరాబాదులోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తున్నారని, తీవ్రంగా వేధిస్తున్నారని కుటుంబ సమేతంగా వచ్చి ఫిర్యాదు చేశారు.
ఫోన్ కాల్స్, మెసేజ్ లతో వైసీపీ సోషల్ మీడియా విభాగం వారు తనను వేధిస్తున్నారని ఆరోపించారు. తన ఫోన్ నెంబరును వైసీపీ సోషల్ మీడియా గ్రూపుల్లో పెట్టారని, దాదాపు 1,800 కాల్స్ చేయించారని వివరించారు. తనను, తన కుటుంబ సభ్యులను కూడా తిట్టారని… అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్చి వచ్చిందని వాపోయారు. పోలీసులకు అన్ని ఆధారాలు సమర్పించానని పృథ్వీ వెల్లడించారు.
కాగా, వేధింపుల అంశంపై త్వరలోనే ఏపీ హోంమంత్రి అనితను కలుస్తానని, వేధింపులకు పాల్పడిన వారిపై రూ.1 కోటి పరువునష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు.