*సబ్సీడీపై వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ*
*అధికారుల నిర్లక్ష్యం వల్ల బడ్జెట్ వెనక్కి వెళ్లే పరిస్థితి*
ధర్మసాగర్, మార్చి 9(ప్రజాజ్యోతి)::
రైతుల సాగు ఖర్చులు తగ్గించి వ్యవసాయాన్ని ఆధునీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకానైజేషన్ పథకం కింద ధర్మసాగర్ మండలం వ్యవసాయ శాఖ కార్యాలయ ఆవరణంలో రైతులకు సబ్సీడీపై వ్యవసాయ యంత్ర పరికరాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి రైతులకు యంత్ర పరికరాలను అందజేశారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి దిగుబడులు పెంచుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వం రైతులకు వివిధ పథకాల ద్వారా సహాయం అందిస్తూ వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు కృషి చేస్తోందని తెలిపారు.
*అధికారుల నిర్లక్ష్యం వల్ల బడ్జెట్ వెనక్కి వెళ్లే పరిస్థితి*
అయితే మండలంలో ఈ పథకానికి సంబంధించిన సబ్సీడీ నిధులపై వ్యవసాయ అధికారులు రైతులకు సరైన అవగాహన కల్పించకపోవడంతో కేటాయించిన బడ్జెట్ పూర్తిగా వినియోగం కాకుండా వెనక్కి వెళ్లే పరిస్థితి నెలకొన్నట్లు రైతులు పేర్కొంటున్నారు. పథకం గురించి రైతులకు సమాచారం అందించడంలో నిర్లక్ష్యం కారణంగా పలువురు రైతులు ఈ అవకాశాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండల వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు కూడా నిర్లక్ష్యంగా స్పందించారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులకు అందాల్సిన సబ్సీడీ నిధులు వృథా కాకుండా అధికారులు చొరవ తీసుకుని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రైతులు కోరుతున్నారు.
