నార్సింగిలో ఘోరం: ఎనిమిదో తరగతి బాలికపై గ్యాంగ్ రేప్

V. Sai Krishna Reddy
1 Min Read

పరిచయం ఉన్న బాలుడే కదా అని నమ్మి వెళ్లిన ఆ బాలికకు ప్రాణ సంకటమైంది. మాయమాటలతో తీసుకెళ్లి, కత్తులతో బెదిరించి, బలవంతంగా మద్యం తాగించి రాత్రంతా నరకం చూపించారు ముగ్గురు మృగాళ్లు. హైదరాబాద్ శివారు చెంగిచెర్లలోని ఖాళీగా ఉన్న ఓ డబుల్ బెడ్రూం ఇల్లు ఈ దారుణానికి వేదికైంది.

నార్సింగిలో నివాసం ఉంటున్న ఎనిమిదో తరగతి బాలికకు, చార్మినార్‌ మదీనా వద్ద పాత పరిచయమున్న ఓ బాలుడు (16) తారసపడ్డాడు. స్నేహం పేరుతో ఫోన్ నంబర్ తీసుకున్న సదరు బాలుడు, వారం రోజుల తర్వాత ఆమెను కలవాలని పిలిచాడు. ఈ నెల 16న స్కూల్‌కు అని చెప్పి వెళ్లిన బాలిక, చార్మినార్‌లో అతడిని కలిసింది. అక్కడ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెకు బిర్యానీ తినిపించి, ఆటోలో చెంగిచెర్లకు తీసుకెళ్లారు.

నిందితుల్లో ఒకడైన ఇమ్రాన్ తల్లిదండ్రులకు ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూం ఇల్లు ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఆ ఇంటికి తీసుకెళ్లి బాలికకు బలవంతంగా మద్యం తాగించారు. ఆమె అడ్డు తిరగడంతో కత్తులతో చంపేస్తామని బెదిరించి ముగ్గురూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రయినా బాలిక ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

నార్సింగి పోలీసులు సాంకేతిక ఆధారాలతో గాలించి చెంగిచెర్లలోని ఇంట్లో ఉన్న బాలికను రక్షించారు. నిందితుల్లో ఒకడైన ఇమ్రాన్‌ (21)పై ఇప్పటికే 8 కేసులు ఉన్నాయని, అతడు రెయిన్ బజార్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ అని తేలింది. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాలుడి (16)ని జువైనల్ హోమ్‌కు తరలింపు. పరారీలో మరో బాలుడి కోసం గాలింపు కొనసాగుతోంది.

నిందితులు ముగ్గురూ తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన వారని, వీరు చిన్న చిన్న దొంగతనాలు, గొడవలకు పాల్పడే బ్యాచ్ అని పోలీసులు గుర్తించారు. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటోంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *