ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన పాస్పోర్ట్ల జాబితాలో భారత్ తన స్థానాన్ని గణనీయంగా మెరుగుపరచుకుంది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో భారత పాస్పోర్ట్ 75వ స్థానంలో నిలిచింది. గతేడాది 85వ స్థానంలో ఉన్న భారత్, ఈసారి ఏకంగా 10 స్థానాలు ఎగబాకడం విశేషం.
ఈ తాజా ర్యాంకు ప్రకారం భారత పాస్పోర్ట్ ఉన్నవారు ముందస్తు వీసా అవసరం లేకుండా 56 దేశాలకు ప్రయాణించే వీలుంది. అంతర్జాతీయంగా భారతీయులకు ప్రయాణ సౌలభ్యం పెరిగిందనడానికి ఈ మెరుగైన ర్యాంకే నిదర్శనం. అయితే, గతంతో పోలిస్తే భారత్ మెరుగైనప్పటికీ ఇది అత్యుత్తమ ర్యాంకు కాదు. 2006లో భారత్ 71వ స్థానాన్ని సాధించడమే ఇప్పటివరకు అత్యుత్తమ ప్రదర్శన. 2024లో 80వ స్థానానికి, ఆ తర్వాత 85వ స్థానానికి పడిపోయిన భారత ర్యాంకు ఇప్పుడు తిరిగి పుంజుకుంది.
ఈ జాబితాలో సింగపూర్ పాస్పోర్ట్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైనదిగా నిలిచింది. సింగపూర్ పౌరులు 192 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. జపాన్, దక్షిణ కొరియా సంయుక్తంగా రెండో స్థానంలో (187 దేశాలు) ఉండగా, స్వీడన్, యూఏఈ మూడో స్థానంలో (186 దేశాలు) ఉన్నాయి. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, స్విట్జర్లాండ్ నాలుగో ర్యాంకును పంచుకున్నాయి. ఆస్ట్రేలియా, యూకే, కెనడా, న్యూజిలాండ్ వంటి దేశాలు టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి.
