జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక… మూతపడిన మద్యం దుకాణాలు

V. Sai Krishna Reddy
1 Min Read

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మంగళవారం (నవంబర్ 11) పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా ఆదివారం నుంచే కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చింది.

ఎన్నికల ప్రచారం ఆదివారంతో ముగియడంతో, అధికారులు శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా నియోజకవర్గ పరిధిలోని అన్ని మద్యం దుకాణాలను మూసివేశారు. ఆదివారం నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లు, క్లబ్బులు, స్టార్ హోటళ్లలోని బార్లు తెరుచుకోవని అధికారులు స్పష్టం చేశారు. మళ్లీ నవంబర్ 14న ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆ రోజు ఉదయం నుంచి కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు కూడా మద్యం అమ్మకాలపై నిషేధం కొనసాగుతుందని తెలిపారు. ఎక్సైజ్ చట్టం 1968, సెక్షన్ 20 ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

అదేవిధంగా, నియోజకవర్గంలో 144 సెక్షన్ విధించారు. దీని ప్రకారం, పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురి కంటే ఎక్కువ మంది గుంపులుగా చేరడంపై నిషేధం ఉంటుంది. ఓట్ల లెక్కింపు రోజున బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చడం కూడా నిబంధనలకు విరుద్ధమని అధికారులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ ఉప ఎన్నిక అన్ని ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీ తరపున నవీన్ యాదవ్, సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు. నగరంలో తమ బలాన్ని చాటుకోవాలని కాంగ్రెస్, పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్, మరింత బలపడాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తుండటంతో ఈ ఉప ఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *