తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నెలకొన్న సందిగ్ధతపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో రెండు వారాల్లోగా స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీ) ఆదేశించింది. ఈ అంశంపై ప్రభుత్వం, ఎన్నికల సంఘం కలిసి చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేయడంతో, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ను ఎన్నికల సంఘం ఇటీవల నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సురేందర్ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా, సుప్రీంకోర్టు కూడా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని చెప్పింది కదా అని హైకోర్టు గుర్తు చేసింది.
దీనిపై ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది స్పందిస్తూ, సుప్రీంకోర్టు కేవలం మౌఖికంగా మాత్రమే చెప్పిందని, లిఖితపూర్వక ఆదేశాల్లో ఆ ప్రస్తావన లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల ఆధారంగా నోటిఫికేషన్ ఇచ్చామని, అది చెల్లకపోవడంతోనే నిలిపివేశామని వివరించారు. రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వంతో చర్చించి, స్పష్టత వచ్చిన తర్వాతే కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయగలమని తెలిపారు. ఈ ప్రక్రియ కోసం కొంత సమయం అవసరమని పేర్కొన్నారు.
ప్రభుత్వం, ఎన్నికల సంఘం తరఫు న్యాయవాదులు రెండు వారాల సమయం కోరడంతో, హైకోర్టు అంగీకరిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఆ లోగా ఎన్నికల తేదీలపై ఒక స్పష్టమైన నిర్ణయంతో రావాలని నిర్దేశించింది.