హైదరాబాద్ నుంచి యూరప్కు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. నెదర్లాండ్స్కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ‘కేఎల్ఎం రాయల్ డచ్ ఎయిర్లైన్స్’ హైదరాబాద్ నుంచి ఆమ్స్టర్డామ్కు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించింది. బుధవారం నుంచి ఈ సేవలు అధికారికంగా అందుబాటులోకి వచ్చాయి. ఈ నాన్స్టాప్ విమాన సర్వీసు వారానికి మూడుసార్లు నడుస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ కొత్త సర్వీసుతో తెలుగు రాష్ట్రాల నుంచి యూరప్ ప్రయాణం మరింత సులభతరం కానుంది.
భారతదేశంలో తమ కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికలో భాగంగా కేఎల్ఎం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాల నుంచి సేవలు అందిస్తుండగా, హైదరాబాద్ తమకు నాలుగో గేట్వే అని కేఎల్ఎం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మార్టెన్ స్టీనెన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ నాలుగు నగరాల నుంచి వారానికి 24 విమానాలను ఆమ్స్టర్డామ్కు నడుపుతున్నామని, శీతాకాలంలో ఈ సంఖ్యను 27కి పెంచనున్నట్లు ఆయన వివరించారు.
హైదరాబాద్ నగరం ఫార్మా, ఐటీ రంగాలకు కీలక కేంద్రంగా ఎదుగుతోందని, ఇక్కడి నుంచి సరుకు రవాణాకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని మార్టెన్ స్టీనెన్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్-ఆమ్స్టర్డామ్ మార్గంలో బోయింగ్ 777-200ఈఆర్ విమానాలను ఉపయోగిస్తున్నామని, ఇందులో వివిధ తరగతుల్లో కలిపి ఒకేసారి 288 మంది ప్రయాణించవచ్చని కేఎల్ఎం అధికారులు వెల్లడించారు. ఈ కొత్త కనెక్టివిటీ వ్యాపార, పర్యాటక రంగాలకు ఎంతో ఊతమిస్తుందని భావిస్తున్నారు.