విలాస వస్తువులపై 40 శాతం జీఎస్టీ.. ఈ ప్ర‌త్యేక శ్లాబు ప‌రిధిలోకి వ‌చ్చేవి ఇవే.

V. Sai Krishna Reddy
2 Min Read

దేశవ్యాప్తంగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో కేంద్ర ప్రభుత్వం సంచలన మార్పులకు శ్రీకారం చుట్టింది. పన్నుల విధానాన్ని మరింత సరళతరం చేస్తూ, ఇప్పటివరకు ఉన్న నాలుగు శ్లాబుల స్థానంలో కేవలం రెండే శ్లాబులను తీసుకొచ్చింది. అదే సమయంలో విలాసవంతమైన, హానికరమైన వస్తువులపై (సిన్ అండ్ సూపర్ లగ్జరీ గూడ్స్) ఏకంగా 40 శాతం ప్రత్యేక పన్ను విధించాలని నిర్ణయించింది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీని ప్రకారం ఇప్పటివరకు అమల్లో ఉన్న 12 శాతం, 28 శాతం పన్ను శ్లాబులను పూర్తిగా రద్దు చేశారు. ఇకపై దేశంలో 5 శాతం, 18 శాతం జీఎస్టీ శ్లాబులు మాత్రమే కొనసాగుతాయి. ఈ మార్పులతో సబ్బుల నుంచి చిన్న కార్ల వరకు అనేక నిత్యావసర వస్తువులపై పన్ను భారం తగ్గి, సామాన్యుడికి ఊరట లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

ఏయే వస్తువులు ప్రియం?
కొత్తగా ప్రవేశపెట్టిన 40 శాతం పన్ను శ్లాబు పరిధిలోకి పలు వస్తువులను చేర్చారు. పాన్ మసాలా, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు ఈ జాబితాలో ఉన్నాయి. వీటితో పాటు శీతల పానీయాలు (చక్కెర కలిపినవి), కెఫిన్ ఉన్న నాన్-ఆల్కహాలిక్ డ్రింక్స్ పై పన్నును 28 శాతం నుంచి ఏకంగా 40 శాతానికి పెంచారు.

వాహనాల విషయానికొస్తే, 1200 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న పెట్రోల్ కార్లు, 1500 సీసీ దాటిన డీజిల్ కార్లు, 4000 మిల్లీమీటర్ల కంటే పొడవైన అన్ని ఆటోమొబైల్స్ పై 40 శాతం జీఎస్టీ వర్తిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. అలాగే, 350 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యమున్న మోటార్ సైకిళ్లు, రేసింగ్ కార్లు, వ్యక్తిగత పడవలు (యాట్స్), ప్రైవేట్ విమానాలపై కూడా ఇదే పన్ను వర్తిస్తుంది.

పొగాకు ఉత్పత్తులు మినహా, మిగిలిన అన్ని కొత్త పన్ను రేట్లు ఈ నెల 22 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని జీఎస్టీ మండలి స్పష్టం చేసింది. ఈ సంస్కరణలు ప్రజల జీవితాలను మెరుగుపరచడంతో పాటు ముఖ్యంగా చిన్న వ్యాపారులకు వ్యాపార సౌలభ్యాన్ని పెంచుతాయని ప్రధాని మోదీ ప్రశంసించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *