చేర్యాల, ఏప్రిల్ 03(ప్రజాజ్యోతి):
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు, తొలి అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమురయ్య ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కురుమ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం దొడ్డి కొమురయ్య 99వ జయంతిని పురస్కరించుకుని చేర్యాల పట్టణంలోని అంగడి బజారులో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నాడు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం సాగిన పోరాటంలో దొడ్డి కొమురయ్య అగ్రభాగాన నిలిచారని కొనియాడారు. నిజాం రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడి, వారి తుపాకీ తూటాలకు ఎదురొడ్డి నేలకొరిగిన గొప్ప వీరుడని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ గడ్డపై విప్లవ శంఖారావం పూరించిన ఆయన చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.దొడ్డి కొమురయ్య సాయుధ పోరాట చరిత్రను పాఠశాల పాఠ్యాంశాలలో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. అలాగే హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ఆ ప్రాంతాన్ని సుందరీకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నేడు రవీంద్ర భారతిలో అధికారికంగా జయంతి వేడుకలను నిర్వహించడం శుభపరిణామమని హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కురుమ సంఘం రాష్ట్ర నాయకులు అందె నాని బాబు, మీస సత్యనారాయణ, అందె బీరయ్య, అందె అశోక్, రాంపూర్ సర్పంచ్ శెట్టె కొమురయ్య, కామల్ల అనిల్ కుమార్, మీస పార్వతి, ఈరి భూమయ్య, జంగిలి యాదగిరి, గౌండ్ల శ్రీనివాస్, సూర్ణ శ్రీకాంత్, నంగి కనకయ్య, శెట్టె కర్ణాకర్, నియోజకవర్గ పునరుద్ధరణ కమిటీ కన్వీనర్ కాటం సంజీవయ్య, పుర్మ ఆగంరెడ్డి, ఆడెపు చంద్రయ్య, భూమిగారి మనోహర్, బుట్టి భిక్షపతి, పోలోజు వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు.
