భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. 600 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

V. Sai Krishna Reddy
1 Min Read

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై విధించిన అదనపు సుంకాలు బుధవారం నుంచి అమలులోకి రానున్నాయి. ఇప్పటికే భారత వస్తుసేవలపై 25 శాతం టారిఫ్ లు విధించిన ట్రంప్.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే సాకుతో అదనంగా మరో 25 శాతం పన్నులు విధించారు. అలాస్కాలో పుతిన్ తో భేటీ తర్వాత ఈ అదనపు సుంకాలపై పునరాలోచిస్తానని ట్రంప్ చెప్పారు. అయితే, గడువు సమీపించినా ఇప్పటి వరకూ సుంకాల మినహాయింపుపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

అదనపు సుంకాల అమలు తప్పదని తేలిపోవడంతో భారత స్టాక్ మార్కెట్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దేశీయ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 600 పాయింట్లు నష్టపోయి 81,036 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 181 పాయింట్లు క్షీణించి 24,788 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.83గా ఉంది.

లాభాల్లో హెచ్ యూఎల్, నష్టాల్లో ఐసీఐసీఐ..
హెచ్ యూఎల్ తో పాటు బజాజ్ ఆటో, హీరో మోటార్ కార్ప్ కంపెనీల షేర్లు నిఫ్టీ సూచీలో లాభాల్లో కొనసాగుతున్నాయి. అదే సమయంలో ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్‌, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌, టాటా స్టీల్, సిప్లా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *