రుతుపవన ద్రోణి, బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలు భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. అనేక చోట్ల కుంభవృష్టి కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
ఈ క్రమంలో తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట, జనగాం, పెద్దపల్లి, కరీంనగర్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, మంచిర్యాల, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. పొలాల్లో పని చేసే రైతులు, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. సోమవారం ప్రారంభమైన ఈ వర్షాలు మంగళవారం కూడా కొనసాగాయి. రాష్ట్రంలోని ఏడు మండలాల్లో 6 నుండి పది సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయిందని తెలిపింది.
హైదరాబాద్లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షపు నీరు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. భారీ వర్షం కారణంగా డ్రైనేజీలు పొంగిపొర్లి రహదారులపైకి నీరు చేరింది. అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు.