ప్రేగుల్లోని బ్యాక్టీరియాతో వ్యాధులకు చెక్.. జపాన్ శాస్త్రవేత్తల కొత్త ఏఐ

V. Sai Krishna Reddy
1 Min Read

క్యాన్సర్, ఊబకాయం, నిద్రలేమి వంటి తీవ్రమైన వ్యాధులకు మన ప్రేగుల్లోనే పరిష్కారం దొరికే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ప్రేగుల్లోని కోట్ల సంఖ్యలో ఉండే బ్యాక్టీరియాకు, మన ఆరోగ్యానికి మధ్య ఉన్న సంక్లిష్ట సంబంధాన్ని ఛేదించేందుకు జపాన్ శాస్త్రవేత్తలు ఒక వినూత్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యవస్థను అభివృద్ధి చేశారు. టోక్యో విశ్వవిద్యాలయం పరిశోధకులు రూపొందించిన ఈ కొత్త విధానం, భవిష్యత్తులో వ్యక్తిగత వైద్య చికిత్సలకు మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు.

మానవ శరీరంలో కణాల కన్నా ఎక్కువగా, దాదాపు 100 ట్రిలియన్ల బ్యాక్టీరియా మన ప్రేగుల్లో నివసిస్తుంది. ఏ బ్యాక్టీరియా ఏ రసాయనాలను ఉత్పత్తి చేస్తుందో, వ్యాధుల సమయంలో ఈ సంబంధాలు ఎలా మారుతాయో అర్థం చేసుకోవడం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు సవాలుగా ఉంది. ఈ సమస్యను అధిగమించేందుకు, టోక్యో యూనివర్సిటీ పరిశోధకులు ‘విబేయస్‌ఎంఎం’ (VBayesMM) అనే ప్రత్యేక బయేసియన్ న్యూరల్ నెట్‌వర్క్‌ను ఉపయోగించారు. ఇది భారీ డేటాను విశ్లేషించి, వ్యాధులకు కారణమయ్యే కీలక బ్యాక్టీరియాలను కచ్చితంగా గుర్తిస్తుంది.

ఈ పరిశోధనలో పాలుపంచుకున్న తుంగ్ డాంగ్ మాట్లాడుతూ… “నిద్రలేమి, ఊబకాయం, క్యాన్సర్ వంటి వ్యాధులపై జరిపిన అధ్యయనాల్లో మా ఏఐ వ్యవస్థ, ప్రస్తుతం ఉన్న పద్ధతుల కన్నా మెరుగైన ఫలితాలు ఇచ్చింది. ఇది కేవలం గణాంకాలను కాకుండా, నిజమైన జీవ సంబంధాలను కనుగొన్నట్లు రుజువైంది.

ఈ సాంకేతికతతో, భవిష్యత్తులో మనకు మేలు చేసే రసాయనాలను ఉత్పత్తి చేయడానికి నిర్దిష్ట బ్యాక్టీరియాను పెంచడం లేదా వ్యాధులను నయం చేయడానికి ప్రత్యేక చికిత్సలను రూపొందించడం సాధ్యమవుతుంది” అని వివరించారు. ఈ ఏఐ ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఇచ్చే సమాధానాలపై ఉన్న అనిశ్చితిని కూడా తెలియజేస్తుంది. దీనివల్ల పరిశోధకులకు ఫలితాలపై మరింత నమ్మకం కలుగుతుంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *