అమెరికాకు కొత్త స్వర్ణయుగం.. చారిత్రక బిల్లుపై ట్రంప్ హర్షం

V. Sai Krishna Reddy
1 Min Read

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో విడత పాలనలో కీలకమైన చట్టపరమైన విజయాన్ని సాధించారు. ఆయన ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’కు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లు పాస్ కావడం అమెరికాకు ఒక ‘కొత్త స్వర్ణయుగం’ ప్రారంభం అని ట్రంప్ అభివర్ణించారు. ఈ చారిత్రక విజయాన్ని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం వైట్ హౌస్‌లో సంతకాల కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఆయన ప్రకటించారు.

ఈ బిల్లుకు సెనేట్ ఇప్పటికే ఆమోదం తెలపగా, గురువారం మధ్యాహ్నం ప్రతినిధుల సభలో జరిగిన ఓటింగ్‌లోనూ రిపబ్లికన్లు దీనిని విజయవంతంగా పాస్ చేయించుకున్నారు. ఈ సందర్భంగా తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో ట్రంప్ స్పందిస్తూ.. “ప్రతినిధుల సభలోని రిపబ్లికన్లు ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ను ఆమోదించారు. మన పార్టీ ఎన్నడూ లేనంత ఐక్యంగా ఉంది. ఈ బిల్లుతో అమెరికా ప్రజలు మరింత ధనవంతులుగా, సురక్షితంగా, గర్వంగా జీవిస్తారు” అని రాశారు. ఈ విజయానికి సహకరించిన హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్, సెనేట్ మెజారిటీ నాయకుడు జాన్ థూన్‌తో పాటు రిపబ్లికన్ సభ్యులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ, ఈ బిల్లు ట్రంప్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని తెలిపారు. “చరిత్రలోనే అతిపెద్ద మధ్యతరగతి పన్ను కోతలు, శాశ్వత సరిహద్దు భద్రత, సైన్యానికి భారీ నిధులు, ఆర్థిక క్రమశిక్షణ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ బిల్లు దేశంలో అపూర్వమైన ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తుంది” అని ఆమె వివరించారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఈ భారీ విజయం సాధించడం విశేషం.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *