తెలంగాణలో పోలీసుల పనితీరు తెలుసుకునేందుకు సరికొత్త విధానం.. క్యూఆర్ కోడ్ ప్రవేశపెట్టామన్న డీజీపీ

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణ రాష్ట్రంలో పోలీసుల పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టామని, దీని ద్వారా ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరిస్తున్నామని డీజీపీ జితేందర్ తెలిపారు. ఈ విధానం ద్వారా ఇప్పటివరకు సుమారు పది పోలీస్ స్టేషన్ల పనితీరుపై ప్రజలు వందశాతం సంతృప్తి వ్యక్తం చేశారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లు ఇదే విధంగా ప్రజల ఆదరాభిమానాలను చూరగొనాలని, ప్రజా స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పాలని డీజీపీ ఆకాంక్షించారు. పోలీసు వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని మరింత పెంపొందించేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించే పోలీసు అధికారులను ప్రజలు ఎల్లప్పుడూ ఆదరిస్తారని ఆయన అన్నారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఇన్‌స్పెక్టర్లతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేయాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. కొంతకాలంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు (ఎస్‌హెచ్ఓలు) వివిధ కీలక అంశాలపై డీజీపీ జితేందర్ ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ శిక్షణలో డీజీపీతో పాటు ఇతర సీనియర్ అధికారులు కూడా పాల్గొని, ఎస్‌హెచ్ఓలకు పలు విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు.

ఇప్పటివరకు సుమారు 80 శాతం మంది ఇన్‌స్పెక్టర్లకు ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేశామని డీజీపీ తెలియజేశారు. సిద్దిపేట, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నారాయణపేట, సూర్యాపేట జిల్లాల్లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్లందరికీ శిక్షణ పూర్తయినట్లు వెల్లడించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్లు తమ పరిధిలోని ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరిస్తూ, బాధితులకు అండగా నిలవాలని డీజీపీ జితేందర్ సూచించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *