జూలై 17న రైల్ రోకోకు పిలుపునిచ్చిన కవిత

V. Sai Krishna Reddy
2 Min Read

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించుకునే వరకు తమ పోరాటం ఆగదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బీసీలందరూ ఈ విషయంలో చైతన్యవంతులు కావాలని ఆమె పిలుపునిచ్చారు. బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాడితే, పదవులు వాటంతటవే బీసీ బిడ్డల కాళ్ల దగ్గరకు వస్తాయని పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలో కామారెడ్డిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించిన డిక్లరేషన్‌ను సాధించేంత వరకు పోరాడుతామని ఆమె అన్నారు. మెదక్ జిల్లాలో “కామారెడ్డి డిక్లరేషన్ – రాజ్యాంగబద్ధంగా 42 శాతం రిజర్వేషన్ల సాధన” అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి కవిత ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఇది రాజకీయ వేదిక కాదని, మానవ హక్కుల వేదిక అని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు వేర్వేరుగా రిజర్వేషన్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు బిల్లును ఢిల్లీకి పంపామని, ఇక తమకేమీ సంబంధం లేదన్నట్లుగా మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఒక్కరోజైనా బీసీ బిల్లు గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడారా అని ఆమె ప్రశ్నించారు. బీసీ బిల్లు ఆమోదం పొందితే బీసీలకు ఉద్యోగాలు, రాజకీయ అవకాశాలు, తగినన్ని నిధులు వస్తాయని కవిత అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనలో చిత్తశుద్ధి కొరవడిందని ఆమె ఆరోపించారు.

బీసీ బిల్లును సాధించేందుకు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకురావాలని కవిత కోరారు. ఈ బిల్లు ఆమోదం కోసం ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగా జూలై 17వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రైల్ రోకో కార్యక్రమాన్ని చేపడతామని ఆమె ప్రకటించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం తేల్చకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తోందని కవిత ఆరోపించారు. ఒకవేళ బీసీలకు సరైన రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలు నిర్వహిస్తే, వాటిని అడ్డుకుంటామని ఆమె హెచ్చరించారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *