పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఆదివారం నాటికి మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇరు దేశాలు శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో ఈ ప్రాంతంలో యుద్ధం తప్పదేమోనన్న ఆందోళనలు పెరిగిపోయాయి. ఇజ్రాయెల్ చేపట్టిన ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’లో భాగంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన, ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రాన్ని లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు జరిపింది. ఇరాన్ వ్యూహాత్మక ఆస్తులే లక్ష్యంగా ఇజ్రాయెల్ తన సైనిక చర్యలను విస్తృతం చేసింది.
టెహ్రాన్లో ఒక నివాస భవనంపై ఇజ్రాయెల్ క్షిపణి దాడి చేయడంతో పెను విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 29 మంది చిన్నారులతో సహా కనీసం 60 మంది మరణించినట్టు ఇరాన్ అధికారులు వెల్లడించారు. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైన తొలి రెండు రోజుల్లో మొత్తం 78 మంది మరణించినట్టు సమాచారం. దాడుల తీవ్రతకు కుప్పకూలిన భవనాల ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అంతకుముందు, ఉత్తర ఇజ్రాయెల్లోని ఒక ఇంటి సమీపంలో జరిగిన దాడిలో ముగ్గురు మహిళలు మరణించగా, పది మంది గాయపడ్డారు.
ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్పై టెహ్రాన్ పెద్ద ఎత్తున క్షిపణులు ప్రయోగించింది. ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్ గగనతలంలోకి ప్రవేశించాయని, గెలీలీ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్ భవనంపై జరిగిన దాడిలో నలుగురు మరణించారని ఇజ్రాయెల్ అత్యవసర సేవల అధికారులు తెలిపారు. ఇరాన్లో అణు కేంద్రాలు, సైనిక మౌలిక సదుపాయాలు, కీలక నాయకులే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు భారీ వైమానిక దాడులకు ఆదేశించారు. నతాంజ్, ఇస్ఫహాన్తో సహా 150కి పైగా ప్రదేశాలపై దాడులు జరిగాయని, ఈ దాడుల్లో పలువురు ఉన్నత సైనిక కమాండర్లు, తొమ్మిది మంది అణు శాస్త్రవేత్తలు మరణించారని తెలిసింది.
“ఇప్పటివరకు వారు చవిచూసింది రాబోయే రోజుల్లో వారు ఎదుర్కోబోయే దానితో పోలిస్తే చాలా చిన్నదని” అని ఇరాన్ను నెతన్యాహు హెచ్చరించారు. ఇరాన్ సుమారు 200 బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను నాలుగు విడతలుగా ఇజ్రాయెల్ లక్ష్యాలపై ప్రయోగించింది. అమెరికా రక్షణ వ్యవస్థల సహాయంతో చాలా వరకు అడ్డగించామని ఇజ్రాయెల్ పేర్కొన్నప్పటికీ, కనీసం ముగ్గురు మరణించగా, డజన్ల కొద్దీ గాయపడ్డారు. తమ క్షిపణులను అడ్డగించడంలో పాలుపంచుకున్న ఏ విదేశీ సైనిక స్థావరం అయినా తమ లక్ష్యం అవుతుందని ఇరాన్ హెచ్చరించింది.
ఇజ్రాయెల్ వైమానిక దాడుల నేపథ్యంలో అమెరికాతో జరగాల్సిన అణు చర్చలను రద్దు చేసుకున్నట్టు ఇరాన్ ప్రకటించింది. మధ్యవర్తిత్వం వహిస్తున్న ఒమన్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. “క్రూరమైన ఇజ్రాయెల్ వైమానిక దాడులు” కొనసాగుతున్నప్పుడు చర్చలు కొనసాగించడం “సమంజసం కాదు” అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఖ్చీ పేర్కొన్నారు. “ఈ పరిస్థితుల్లో చర్చలు కొనసాగించడం అర్థరహితం. వాషింగ్టన్ మౌనం దీనికి సహకరిస్తున్నట్టే ఉంది” అని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఈ ఉద్రిక్తతలపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశంలో, ఉద్రిక్తతలను తగ్గించడానికి “చర్చలు, దౌత్యం” అవసరమని భారత్ పిలుపునిచ్చింది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులను చైనా నేతృత్వంలోని ఈ కూటమి తీవ్రంగా ఖండించినప్పటికీ, భారత్ మాత్రం సంయమనం పాటించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది