బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లండన్, అమెరికా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ముఖ్యంగా అమెరికాలోని డాలస్లో జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలతో పాటు, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబరాల్లో కూడా కేటీఆర్ పాల్గొంటారు.
కేటీఆర్ తన పర్యటనలో భాగంగా మొదట యూకే వెళ్లనున్నారు. ఈ నెల 30న లండన్లో బ్రిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగే ప్రతిష్ఠాత్మక “ఇండియా వీక్ 2025” సదస్సులో ఆయన ప్రధాన ఉపన్యాసం చేయనున్నారు. ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖులు పాల్గొంటారు. ఈ వేదికపై కేటీఆర్, బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ సాధించిన అభివృద్ధి, వినూత్న ఆవిష్కరణల గురించి వివరించనున్నారు. తెలంగాణ విజయ ప్రస్థానాన్ని, అభివృద్ధి నమూనాని అంతర్జాతీయ సమాజానికి తెలియజేయనున్నారు.
అదే రోజు వార్విక్లో, మొబిలిటీ టెక్నాలజీ రంగంలో తెలంగాణకు చెందిన ఆవిష్కరణలకు నిదర్శనంగా నిలిచిన ప్రాగ్మాటిక్ డిజైన్ సొల్యూషన్స్ లిమిటెడ్ (PDSL) నాలెడ్జ్ సెంటర్ను కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కేంద్రం మెక్లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి ప్రపంచ ప్రఖ్యాత ఆటోమోటివ్ సంస్థలకు పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్ అండ్ డీ) సేవలను అందించనుంది. ఇందులో అత్యాధునిక నీర్ షోర్ హార్డ్వేర్-ఇన్-లూప్ (HIL) టెస్ట్ సెంటర్ కూడా ఉంది.
యూకే పర్యటన ముగించుకున్న అనంతరం కేటీఆర్ అమెరికా వెళ్తారు. అక్కడ తెలంగాణ ఎన్ఆర్ఐలు నిర్వహించే పలు ముఖ్యమైన కార్యక్రమాలకు ఆయన హాజరవుతారు. జూన్ 1న టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో నగరంలో ఉన్న కొమెరికా సెంటర్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల రజతోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ భారీ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన వేలాది మంది ప్రవాస భారతీయులు పాల్గొంటారని అంచనా.
జూన్ 2న కేటీఆర్, డాలస్లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ (యూటీ డాలస్)లో భారతీయ విద్యార్థులతో సమావేశమవుతారు. తన ప్రసంగాలు, పనితీరుతో యువతకు స్ఫూర్తిగా నిలిచే కేటీఆర్, ఈ సందర్భంగా నూతన ఆవిష్కరణలు, ఎంట్రప్రెన్యూర్షిప్తో పాటు భవిష్యత్ భారత నిర్మాణంలో విద్యార్థుల పాత్ర గురించి ప్రసంగించనున్నారు.
ఈ పర్యటనలో కేటీఆర్ వివిధ దేశాల మేధావులు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులతో సమావేశమై తెలంగాణ ప్రగతిని, ఇక్కడి అవకాశాలను వివరించనున్నారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్, పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ తదితరులు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరారు. కేటీఆర్ యూకే, యూఎస్ పర్యటన పట్ల అక్కడి ఎన్ఆర్ఐలు, వ్యాపారవేత్తలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.