దేశంలో మరోసారి కొత్త కరెన్సీ నోట్లు రానున్నాయి. మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్ కింద త్వరలో కొత్త రూ.20 డినామినేషన్ నోట్లను విడుదల చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది. ఈ తాజా నోట్లపై ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది.
అయితే కొత్త నోట్ల డిజైన్, ఫీచర్లు ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్ల మాదిరిగానే ఉంటాయని తెలిపింది. నోట్ల రంగు, కొలతలు, సెక్యూరిటీ ఫీచర్లు, వెనుక వైపు ఉండే ఎల్లోరా గుహల చిహ్నం అన్నీ అలాగే ఉంటాయి అని చెప్పింది. ఈ మేరకు సెంట్రల్ బ్యాంకు ఒక నోటిఫికేషన్లో తెలిపింది.
గతంలో జారీ చేసిన అన్ని రూ.20 నోట్లు, జారీ చేసే గవర్నర్ సంతకంతో సంబంధం లేకుండా పూర్తిగా చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ వెల్లడించింది. కొత్త గవర్నర్ సంతకంతో కొత్త నోట్లను జారీ చేయడం అనేది ఆర్బీఐ అధినాయకత్వం మార్పు తర్వాత సాధారణంగా జరిగే ప్రక్రియేనని, ఇది ప్రస్తుత కరెన్సీ నోట్ల వినియోగం లేదా విలువను ప్రభావితం చేయదని తెలిపింది.