నీట్ పరీక్ష ఫలితాలకు బ్రేక్.. స్టే విధించిన మద్రాస్ హైకోర్టు

V. Sai Krishna Reddy
1 Min Read

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నీట్ యూజీ 2025 ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ ఫలితాలపై మద్రాస్ హైకోర్టు స్టే విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో త్వరలో విడుదల కావాల్సిన ఫలితాల ప్రక్రియ నిలిచిపోయింది.

వివరాల్లోకి వెళితే, మే 4వ తేదీన జరిగిన నీట్ యూజీ 2025 పరీక్ష సందర్భంగా ఒక పరీక్షా కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం ఈ వివాదానికి కారణమైంది. సరైన వెలుతురు లేకుండానే పరీక్ష రాయాల్సి వచ్చిందని, అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ 13 మంది విద్యార్థులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. పరీక్ష నిర్వహణ ప్రక్రియ, దాని నిజాయతీ, సమగ్రతపై వారు పిటిషన్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, నీట్ యూజీ 2025 ఫలితాల విడుదలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది.

ఇదిలా ఉండగా, మధ్యప్రదేశ్ హైకోర్టుకు చెందిన ఇండోర్ బెంచ్ కూడా నీట్ ఫలితాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. దీంతో దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఫలితాలపై ఆందోళన నెలకొంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *