పాకిస్థాన్‌కు షాక్ మీద షాక్.. చీనాబ్ డ్యామ్‌లపై భారత్ కీలక చర్యలు

V. Sai Krishna Reddy
2 Min Read

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ జలవనరుల ప్రాజెక్టులపై దృష్టి సారించింది. చీనాబ్ నదిపై ఉన్న సలాల్, బాగ్లిహార్ జల విద్యుత్ ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే పనులను ప్రారంభించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఈ డ్యామ్‌లను భారత్ మూసివేసింది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసినందున, ఈ పనుల గురించి పాకిస్థా‌న్‌కు సమాచారం ఇవ్వలేదు.

ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌హెచ్‌పీసీ ఆధ్వర్యంలో ఈ రెండు డ్యామ్‌ల రిజర్వాయర్లలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన పనులు మొదలయ్యాయని సమాచారం. ఇటీవల ఒక రిజర్వాయర్‌లో పేరుకుపోయిన బురదను తొలగించేందుకు ‘ఫ్లషింగ్’ ప్రక్రియను చేపట్టారు. గత గురువారం ప్రారంభమైన ఈ ప్రక్రియ దాదాపు మూడు రోజుల పాటు కొనసాగింది. ఈ ఫ్లషింగ్ ప్రక్రియ ద్వారా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరగడంతో పాటు టర్బైన్ల మన్నిక కూడా పెరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన తరువాత, ఆ ఒప్పంద స్ఫూర్తికి భిన్నంగా భారత్ చర్యలు చేపట్టడం ఇదే తొలిసారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనిపై సెంట్రల్ వాటర్ కమిషన్ మాజీ అధిపతి కుష్వీందర్ వోహ్రా మాట్లాడుతూ, “ఒప్పందాన్ని నిలిపివేసినందున, మన ప్రాజెక్టులలో చేపట్టే మార్పుల గురించి పాకిస్తాన్‌కు తెలియజేయాల్సిన బాధ్యత భారత్‌కు లేదు” అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో భారత్ తన అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టులలో మార్పులు చేసుకునే అవకాశం ఏర్పడింది.

సలాల్ డ్యామ్‌ను 1987లో, బాగ్లిహార్ డ్యామ్‌ను 2009లో ప్రారంభించారు. ఈ డ్యామ్‌లతో పాటు సింధు నదీ వ్యవస్థ పరిధిలోకి వచ్చే మరో అరడజను ప్రాజెక్టులు భారత్ వద్ద ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నింటిలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచితే, భవిష్యత్తులో పాకిస్థాన్‌కు నీటి కొరత ఏర్పడే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, తక్షణమే పాకిస్థాన్‌కు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయే అవకాశం లేదని వారు స్పష్టం చేస్తున్నారు.

ప్రస్తుతం జరుగుతున్న పనులపై భారత ప్రభుత్వం గానీ, ఎన్‌హెచ్‌పీసీ గానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. మరోవైపు, సింధు జలాల ఒప్పందం విషయంలో భారత్ చర్యలను ఎదుర్కొనేందుకు పాకిస్థాన్ వద్ద పరిమిత అవకాశాలే ఉన్నాయి. ఈ ఒప్పందానికి మధ్యవర్తిగా వ్యవహరించిన ప్రపంచ బ్యాంకును ఆశ్రయించడం మినహా ఇతర మార్గాల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ప్రపంచ బ్యాంకుకు కేవలం మధ్యవర్తిత్వం వహించే పాత్రే ఉంది తప్ప, ఒప్పందాన్ని అమలు చేసే అధికారం లేదని నిపుణులు గుర్తు చేస్తున్నారు. అభిప్రాయభేదాలు వస్తే చర్చలకు ప్రోత్సహించడం, తటస్థ నిపుణులను లేదా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఛైర్మన్లను నియమించడం వరకే దాని పరిధి ఉంటుంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *