ఉప్పల్ స్టేడియంలో స్టాండ్‌కు పేరు తొలగింపు.. తీవ్రంగా స్పందించిన అజారుద్దీన్

V. Sai Krishna Reddy
1 Min Read

అధ్యక్షుడిగా అధికార దుర్వినియోగం చేశారన్న ఫిర్యాదుతో అంబుడ్స్‌మన్‌ చర్యలు
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మాజీ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో గల రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలోని నార్త్ స్టాండ్‌కు తన పేరును తొలగించాలని హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్‌ ఆదేశించడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఇది చాలా బాధాకరమని, క్రీడకు జరిగిన అవమానమని ఆయన వ్యాఖ్యానించారు.

హెచ్‌సీఏ సభ్య సంఘం లార్డ్స్ క్రికెట్ క్లబ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన అంబుడ్స్‌మన్‌, రిటైర్డ్ జస్టిస్ వి. ఈశ్వరయ్య ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అజారుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ముఖ్యంగా 2019 డిసెంబర్‌లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో జనరల్ బాడీ ఆమోదం లేకుండానే నార్త్ స్టాండ్‌కు ఆయన పేరు పెట్టుకునేలా తీర్మానం చేయించుకున్నారని పిటిషన్‌లో ఆరోపించారు.

ఈ పరిణామాలపై అజారుద్దీన్ మాట్లాడుతూ, ఇది తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. అసలు ఎందుకు క్రికెట్ ఆడానా అని కూడా బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆట గురించి ఏమాత్రం తెలియని వారు ఇప్పుడు నాయకత్వం వహించడం క్రీడకు జరిగిన అవమానమని ఆయన పేర్కొన్నారు. ఈ అన్యాయంపై న్యాయపోరాటం చేస్తానని, ఈ విషయంలో బీసీసీఐ జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. హెచ్‌సీఏలో అవినీతిని తాను బయటపెట్టినందుకే, తనను లక్ష్యంగా చేసుకుని ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఇది పూర్తిగా వ్యక్తిగత కక్ష సాధింపు చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *