సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ సంస్థ వైస్ ఛైర్మన్, ఎండీ సజ్జనార్ బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. టీజీఆర్టీసీలో త్వరలో 3,038 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకు ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు ఆయన తెలిపారు. వీటి భర్తీ తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులపై పనిభారం తగ్గుతుందని చెప్పారు.
కొత్తగా భర్తీ చేయనున్న పోస్టులకు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామన్నారు. సంస్థలోని ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉందని సజ్జనార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఖుష్రోషా ఖాన్, వెంకన్న, మునిశేఖర్, రాజ్శేఖర్… జాయింట్ డైరెక్టర్లు ఉషాదేవి, నర్మద… రంగారెడ్డి జిల్లా రీజినల్ మేనేజర్ శ్రీలత… ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం నేతలు పాల్గొన్నారు.