జేపీ జీవితంలోని ఆసక్తికర అంశాలు

V. Sai Krishna Reddy
2 Min Read

జయప్రకాశ్ నారాయణ్ లేదా జేపీ… అంటే తెలుగు రాష్ట్రాలవారికి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఐఏఎస్ అధికారిగా తనదైన ముద్ర వేసి, ఆపై లోక్ సత్తాను స్థాపించి రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుత రాజకీయాల శైలి… జేపీ శైలికి భిన్నంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అందుకే ఆయన రాజకీయాల్లో ఏమంత యాక్టివ్ గా లేరు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జయప్రకాశ్ నారాయణ ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ఆంధ్రాలో పుట్టినా కొంతకాలం మహారాష్ట్రలో పెరిగానని తెలిపారు. ఆ తర్వాత ఏపీలో ఉన్న అమ్మమ్మ గారికి వద్దకు పంపించారని గుర్తుచేసుకున్నారు.

“మా నాన్నగారు రైల్వే లో పని చేసేవారు. ఆయన పేరు వెంకటేశ్వర రావు గారు. రైల్వేలో పనిచేశారు. విజయవాడలోని ఓ ఆసుపత్రిలో పుట్టాను. కొంచెం కష్టమైన డెలివరీ ఆ రోజుల్లో. మా అమ్మకి పుట్టుకతోనే కష్టపెట్టాను. నేను పెద్దవాడిని. నా తర్వాత ఒక తమ్ముడు… ఆ తర్వాత ఒక చెల్లెలు ఉండేది. కానీ చిన్ననాడే ఆ పాప చనిపోయింది. నాకు కరెక్ట్ గా ఏ వయసో కూడా గుర్తులేదు. నాకు మూడేళ్ల వయసు లోపలే పోయింది… మా చెల్లి పేరు రాణి అని తెలుసు కానీ… ముఖం అస్పష్టంగా గుర్తుంది. ఆ పాప చిన్ననాడే ఏదో విరోచనాలు, డీ హైడ్రేషన్ వల్ల పోయింది.

ఒక తమ్ముడు రైల్వేలో పనిచేసి రిటైర్ అయ్యారు. మరొక తమ్ముడు హైదరాబాద్‌లో లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. చిన్నప్పుడు నేను బాగా లావుగా ఉండేవాడిని. ఆ రోజుల్లో పెద్దగా అద్దాల్లో చూసుకునేవాళ్ళం కాదు, ఫొటోలు ఎక్కువ లేవు కాబట్టి… లావుగా ఉన్నాను అన్న స్పృహ నాకు లేదు. అప్పట్లో పెరుగు, బూరెలు గారెలు తినేవాళ్లం. నేను పెద్దగా ఆటల్లో కూడా పాల్గొనేవాడ్ని కాను. పాత స్కూల్ రికార్డు చూస్తే పరీక్షలు అన్నిటిలో టాప్… స్పోర్ట్స్ అన్నింటిలో అట్టడుగున ఉంటాను.

కాలేజీకి రాగానే మొత్తం మారిపోయింది. అక్కడి హాస్టలో మనకు కుదరక బరువు తగ్గిపోయాను. తిండి చాలా వరకు తగ్గిపోయింది. నేను ఐఏఎస్ అయ్యేనాటికి 54 కేజీలు ఉన్నాను. ఇప్పుడొక 66-67 కేజీలు ఉంటానేమో. ఇక నేను గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివాను. ఇంటర్మీడియట్ తర్వాత ఫస్ట్ అటెంప్ట్ లోనే మెడిసిన్ వచ్చింది” అని వివరించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *