హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ స్థిరంగా కొనసాగుతోంది. ఈ కొత్త ఏడాది 2025 జనవరిలో 5444 స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా ఓ నివేదిక విడుదల చేసింది. అయితే గత ఏడాది ఇదే నెలలో 5454 రిజిస్ట్రేషన్లు జరిగాయి. అలాగే హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్, కోకాపేటను మించి ఆ ఏరియాలో ఓ ఫ్లాట్ రూ. 9 కోట్లకు విక్రయించినట్లు తెలిపింది. రియల్ ఎస్టేస్ వివరాలు తెలుసుకుందాం. హైదరాబాద్ మహానగరం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, మౌలిక వసతులు అందుబాటులోకి రావడం, రవాణా మెరుగవుతున్న క్రమంలో నగర రియల్ ఎస్టేట్ మార్కెట్ స్థిరంగా కొనసాగుతోంది. ఈ 2025 జనవరి నెలలో మొత్తం 5444 స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గతేడాది 2024, జనవరి నెలలో 5454 రిజిస్ట్రేషన్లతో పోలిస్తే కాస్త తగ్గినా నిలకడగానే రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్లు చేసుకున్న స్థిరాస్తుల సగటు విలువ వార్షికంగా 3 శాతం మేర పెరిగినట్లు నైట్ ఫ్రాంగ్ ఇండియా సంస్థ ఓ నివేదిక వేడుదల చేసింది. మొత్తం రిజిస్ట్రేషన్లలో 2 వేల చదరపు అడుగులు ఆపైన విస్తీర్ణం కలిగి ఇళ్ల వాటానే 14 శాతం మేర ఉందని తెలిపింది. హైదరాబాద్లో జూబ్లీహిల్స్, కోకాపేట వంటి డిమాండ్ ఉన్న ప్రాంతాలను మించి పుప్పాలగూడలో అత్యధిక విలువ కలిగిన ఫ్లాట్ రిజిస్ట్రేషన్ జరిగిందని నివేదిక తెలిపింది. అక్కడ ఓ ఫ్లాట్ ఏకంగా రూ.9 కోట్లకు విక్రయమైనట్లు తెలిపింది. జనవరి నెలలో గణాంకాలు చూస్తే రూ.50 లక్షల లోపు విక్రయాలు జరిగిన నివాసాలు 3282 ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే 3 శాతం తగ్గాయి. రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి లోపు విలువ గల ఇళ్లలో 3 శాతం వృద్ధి నమోదైంది. 2024 జనవరి నెలలో 1319 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరగగా అది ఈ ఏడాది 1359కి చేరింది. రూ.1 కోటి పైన విలువ గల ఇళ్ల రిజిస్ట్రేషన్లలో 12 శాతం పెరుగుదల కనిపించింది. మొత్తం 823 ఇళ్లు విక్రయమైనట్లు నివేదిక తెలిపింది.