ఇటీవలి కాలంలో చాలా మంది షుగర్ తో బాధపడుతున్నారు. షుగర్ వ్యాధికి లోనవకున్నా… ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ వంటి వాటితో త్వరలోనే మధుమేహం బారిన పడే అవకాశం ఉన్నవారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి వారి శరీరంలో ఇన్సూలిన్ సెన్సిటివిటీ తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల తగిన స్థాయిలో ఇన్సూలిన్ ఉత్పత్తి అయినా కూడా రక్తంలో షుగర్ స్థాయులు నియంత్రణలో ఉండవు. అలాంటి వారు కొన్ని రకాల ప్రొటీన్లు ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే… శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఎండు బీన్స్…
ఒక కప్పు ఎండు బీన్స్ లో ఏకంగా 15 గ్రాముల ఫైబర్ ఉంటుందని, ఇందులో అధికంగా ఉండే ప్రొటీన్లతో శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పైగా వీటి గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువని, మధుమేహం ఉన్నవారు కూడా తీసుకోవచ్చని వివరిస్తున్నారు.
చిక్ పీ (శనగలు)…
నల్ల శనగలు, పచ్చ శనగలు, కాబూలీ శనగలు… ఇలా ఏవైనా సరే ప్రొటీన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. వీటితోపాటు రెసిస్టెంట్ స్టార్చ్ కూడా ఎక్కువేనని… ఇవి ఆహారం జీర్ణమయ్యే వేగాన్ని తగ్గిస్తాయని, శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
చియా సీడ్స్…
చియా సీడ్స్ ఎన్నో పోషక విలువలకు కేంద్రం. ముఖ్యంగా ఒమేగా–3 ఫ్యాటీ ఆమ్లాలు, ఫైబర్, ప్రొటీన్లు ఎక్కువ. ఇవి రక్తంలో షుగర్ స్థాయులను నియంత్రణలో ఉండేలా చూస్తాయని నిపుణులు చెబుతున్నారు.
టోఫు పనీర్…
సోయా బీన్స్ నుంచి తయారు చేసే ‘టోఫు’ పనీర్ కూడా కార్బోహైడ్రేట్లు తక్కువగా, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే అద్భుత ఆహారమని నిపుణులు చెబుతున్నారు. మన శరీరంలో కండరాల పనితీరు మెరుగుపడటానికి, షుగర్ స్థాయులు నియంత్రణలో ఉండటానికి ఇవి దోహదం చేస్తాయని వివరిస్తున్నారు.
క్వినోవా…
మన శరీరానికి అవసరమైన అన్ని రకాల అమైనో యాసిడ్లు ఉండే పూర్తి స్థాయి ప్రొటీన్ ఫుడ్ క్వినోవా అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో అధికంగా ఉండే ఫైబర్, ప్రొటీన్ పదార్థాలు… రక్తంలో షుగర్ స్థాయులు నియంత్రణలో ఉండేందుకు తోడ్పడుతాయని పేర్కొంటున్నారు.