బెంగళూరులో ప్రతిష్ఠాత్మక రీతిలో ఏరో ఇండియా-2025 వైమానిక ప్రదర్శన జరుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు నేడు ఏరో ఇండియా ఎయిర్ షోకి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన యుద్ధ విమానాన్ని నడపడం విశేషం. ఈ విషయాన్ని రామ్మోహన్ నాయుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఏరో ఇండియా-2025 ఎయిర్ షో లో యుద్ధవిమానాన్ని నడపడం మరిచిపోలేని అనుభూతినిచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. హెచ్ఏఎల్ సంస్థ దేశీయంగా తయారుచేసిన ఈ హెచ్ జేటీ-36 యశస్ అనే అద్భుతమైన జెట్ విమానంలో ప్రయాణించే అరుదైన అవకాశం వచ్చిందని తెలిపారు.
విమానయాన, రక్షణ రంగంలో నానాటికీ పెరుగుతున్న పరాక్రమానికి ఈ స్వదేశీ అద్భుతం నిదర్శనం అని అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యసాధనలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త శిఖరాలకు చేరుకోవడం ఆనందంగా ఉందని రామ్మోహన్ నాయుడు వివరించారు.