గంజాయి సాగు గుట్టురట్టు.. 400 మొక్కలు స్వాధీనం
400 మొక్కలు స్వాధీనం
పత్తి పంటలో అంతర పంటగా గంజాయి సాగు.. నిందితులపై కేసు నమోదు
గాంధారి, సెప్టెంబర్ 18 (ప్రజాజ్యోతి )
పత్తి పంటలో అంతర పంటగా గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాంధారి మండలం నేరల్తండాకు చెందిన ముగ్గురు కౌలుదారులు కలిసి మండల కేంద్రానికి చెందిన ఓ రైతు వ్యవసాయ క్షేత్రంలో గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సుమారు 400 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని, నిందుతులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు .పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధారి శివారు ప్రాంతంలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్నారన్న సమాచారంతో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు పోలీసులు పక్కా సమాచారంతో దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా పత్తి పంట మధ్యలో సాగు చేస్తున్న గంజాయి మొక్కలను గుర్తించారు. వాటిని పూర్తిగా స్వాధీనం చేసుకుని, నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.గంజాయి సాగు, విక్రయం, రవాణాకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు అక్రమ గంజాయి కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తామని ఎస్పీ తెలిపారు.
