కోనసీమలో ‘చార్లి’ మిస్సింగ్.. రూ.80 వేల చిలుక ఎగిరిపోయింది

V. Sai Krishna Reddy
1 Min Read

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న తన పెంపుడు చిలుక కనిపించకుండా పోవడంతో ఓ యజమాని తీవ్ర ఆవేదన చెందుతున్నాడు. మూడేళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఆ చిలుక ఆచూకీ కోసం పోలీసులను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాడు.

వివరాల్లోకి వెళితే.. కొత్తపాలేనికి చెందిన బండారు దొరబాబు కాట్రేనికోనలో వస్త్ర దుకాణం నడుపుతుంటారు. ఆయనకు పక్షులంటే ఎంతో ఇష్టం. ఈ క్రమంలోనే మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లో రూ.80 వేలు పెట్టి ఒక ప్రత్యేకమైన చిలుకను కొనుగోలు చేశారు. దానికి ‘చార్లి’ అని పేరు పెట్టుకుని ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నారు. మనుషుల మాటలను స్పష్టంగా అనుకరిస్తూ అందరినీ అలరించే ఆ చిలుక అంటే దొరబాబుకు ప్రాణం.

ఇటీవల సంక్రాంతి పండుగ రోజున ‘చార్లి’ ప్రమాదవశాత్తు పంజరంలో నుంచి బయటకు వచ్చింది. వెంటనే అక్కడి నుంచి ఎగిరిపోయింది. తనతో బాగా అలవాటు పడిన చిలుక కదా, సాయంత్రానికల్లా తిరిగి వస్తుందని దొరబాబు భావించాడు. కానీ, అది తిరిగి రాలేదు. ఎన్ని రోజులు గడిచినా, ఎంత వెతికినా చార్లి ఆచూకీ లభించకపోవడంతో దొరబాబు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.

మూడేళ్లుగా తనతో ఉన్న చిలుక ఇలా దూరమవడంతో తట్టుకోలేకపోతున్నారు. అందుకే తన చిలుకను కనిపెట్టడంలో సహాయం చేయాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. అపురూపంగా పెంచుకున్న పక్షి కోసం యజమాని పడుతున్న ఆవేదన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *