బిహార్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్?.. జేడీయూలోకి ఆరుగురు ఎమ్మెల్యేలు

V. Sai Krishna Reddy
1 Min Read

బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలోని ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) లో చేరబోతున్నారంటూ ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి. అయితే, ఈ వార్తలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది.

ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమాలకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. ముఖ్యంగా జనవరి 13న పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ‘దహీ-చూరా’ విందుకు కూడా వారు హాజరుకాలేదు. సంక్రాంతి తర్వాత కాంగ్రెస్‌లో పెద్ద రాజకీయ మార్పు ఉంటుందని ఎన్డీయే నేతలు చెప్పడం ఈ ఊహాగానాలకు ఆజ్యం పోసింది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 6 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఒకవేళ ఈ ఎమ్మెల్యేలు జేడీయూలో చేరితే, అసెంబ్లీలో జేడీయూ బలం మిత్రపక్షమైన బీజేపీ కంటే పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 243 స్థానాలున్న అసెంబ్లీలో ఎన్డీయేకు 202 మంది సభ్యుల బలం ఉంది. ఇందులో బీజేపీకి 89, జేడీయూకు 85 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఈ ఫిరాయింపు వార్తలను బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేశ్ రామ్, మాజీ సీఎల్పీ నేత షకీల్ అహ్మద్ ఖాన్ కొట్టిపారేశారు. “మా ఎమ్మెల్యేలు అందరూ పార్టీతోనే ఉన్నారు. ఇదంతా రాజకీయ ప్రత్యర్థులు మా కార్యకర్తల స్థైర్యాన్ని దెబ్బతీయడానికి వ్యాప్తి చేస్తున్న పుకార్లు” అని వారు స్పష్టం చేశారు. ఎన్డీయే నేతలు చెప్పినట్లు సంక్రాంతి తర్వాత ఎలాంటి ఫిరాయింపులు జరగనప్పటికీ, బిహార్ కాంగ్రెస్‌లో రాజకీయ అనిశ్చితి మాత్రం కొనసాగుతోంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *