బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురు మృతి

V. Sai Krishna Reddy
1 Min Read

బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కర్లపాలెం మండలం, సత్యవతిపేట సమీపంలో అర్ధరాత్రి కారు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు చిన్నారులు గాయాలతో బయటపడ్డారు. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మ కుమారుడి సంగీత్ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ విషాదం జరిగింది.

వివరాల్లోకి వెళితే, కర్లపాలెం గ్రామానికి చెందిన బేతాళం బలరామరాజు (65), ఆయన భార్య బేతాళం లక్ష్మి (60), గాదిరాజు పుష్పవతి (60), ముదుచారి శ్రీనివాసరాజు (54) ఒకే కారులో ప్రయాణిస్తున్నారు. నిన్న రాత్రి బాపట్లలో జరిగిన ఎమ్మెల్యే కుమారుడి సంగీత్ కార్యక్రమానికి వీరంతా హాజరయ్యారు. వేడుక ముగిసిన అనంతరం అర్ధరాత్రి దాటాక ఒంటిగంట సమయంలో కారులో తిరుగు పయనమయ్యారు.

సత్యవతిపేట వద్దకు రాగానే, ఎదురుగా వస్తున్న లారీ వీరి కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న బలరామరాజు, లక్ష్మి, పుష్పవతి, శ్రీనివాసరాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అదే కారులో ప్రయాణిస్తున్న 13, 11 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన చిన్నారులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరికీ ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందడంతో కర్లపాలెంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *