ఉప ఎన్నిక ముగిసేవరకు… హైదరాబాద్ లోనే కేసీఆర్ మకాం

V. Sai Krishna Reddy
1 Min Read

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ తన వ్యూహాలకు పదును పెట్టింది. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉన్న ఆ పార్టీ, ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ఎన్నికల వ్యూహరచనపై దృష్టి సారించారు.

గురువారం ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ ముఖ్య నేతలతో సమావేశమై జూబ్లీహిల్స్ ఉపఎన్నికపైనే ప్రధానంగా చర్చించారు. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇక పూర్తిగా ప్రచారంపై దృష్టి పెట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఉపఎన్నిక పూర్తయ్యేంత వరకు ఆయన హైదరాబాద్‌లోని నందినగర్‌లో ఉన్న తన నివాసంలోనే మకాం వేసి, ఎన్నికల సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

నియోజకవర్గంలో ప్రచార బాధ్యతలను మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులకు కేసీఆర్ అప్పగించారు. వారిద్దరి నేతృత్వంలో నియోజకవర్గవ్యాప్తంగా భారీ ఎత్తున రోడ్ షోలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోకూడదనే గట్టి పట్టుదలతో బీఆర్ఎస్ అధిష్ఠానం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. కేసీఆర్ ప్రత్యక్ష పర్యవేక్షణతో జూబ్లీహిల్స్‌లో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *