ఆల్-టైమ్ రికార్డ్.. తులం బంగారం ధర రూ.1.10 లక్షలు

V. Sai Krishna Reddy
1 Min Read

దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు రికార్డుల మోత మోగిస్తున్నాయి. మంగళవారం పసిడి ధర జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరగా, వెండి 14 ఏళ్లలోనే అత్యధిక రేటును నమోదు చేసింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో 10 గ్రాముల బంగారం ధర రూ.458 పెరిగి ఏకంగా రూ.1,10,047కి చేరి సరికొత్త రికార్డు సృష్టించింది.

అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడటమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఇటీవల అమెరికాలో వెలువడిన ఉద్యోగాల గణాంకాలు తీవ్రంగా నిరాశపరచడంతో, అక్కడి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను భారీగా తగ్గిస్తుందన్న అంచనాలు బలపడ్డాయి. ఆగస్టులో అంచనా వేసిన 75,000 ఉద్యోగాలకు బదులుగా కేవలం 22,000 మాత్రమే నమోదయ్యాయి. దీంతో నిరుద్యోగిత రేటు 4.3 శాతానికి పెరిగింది.

ఈ పరిణామాలతో డాలర్ ఇండెక్స్ ఆరు వారాల కనిష్ఠానికి పడిపోవడంతో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రకారం, మంగళవారం 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.10,804గా పలికింది. మరోవైపు, భారత్ లో గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) లలోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఆగస్టులో 233 మిలియన్ డాలర్ల నికర పెట్టుబడులు వచ్చాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది.

సెప్టెంబర్ 17న జరగనున్న అమెరికా ఫెడ్ సమావేశంలో 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటు కోత విధించే అవకాశం 91 శాతం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాబోయే ద్రవ్యోల్బణ నివేదికలు ఫెడ్ నిర్ణయాన్ని మరింత ప్రభావితం చేయనున్నాయి. టెక్నికల్ గా చూస్తే, బంగారానికి రూ.1,08,040 వద్ద మద్దతు, రూ.1,08,950 వద్ద నిరోధం వున్నాయని మెహతా ఈక్విటీస్ నిపుణుడు రాహుల్ కలాంత్రీ తెలిపారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *