ఆకాశ్ దీప్ విజృంభణ… విజయానికి 5 వికెట్ల దూరంలో టీమిండియా

V. Sai Krishna Reddy
1 Min Read

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా చారిత్రక విజయం దిశగా దూసుకెళుతోంది. భారత పేసర్ ఆకాశ్ దీప్ నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లండ్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. ఐదో రోజు ఆటలో భారత బౌలర్ల ధాటికి ఇంగ్లీష్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో ఆతిథ్య జట్టు ఓటమి అంచున నిలవగా, భారత్ గెలుపుకు కేవలం ఐదు వికెట్ల దూరంలో నిలిచింది. అంతకుముందు వర్షం కారణంగా ఐదో రోజు ఆట కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది.

భారత్ నిర్దేశించిన 608 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను ఆకాశ్ దీప్ ఆరంభం నుంచే దెబ్బతీశాడు. తన పదునైన బౌలింగ్‌తో బెన్ డకెట్ (25), ఓలీ పోప్ (24), జో రూట్ (6), హ్యారీ బ్రూక్ (23) వంటి కీలక బ్యాటర్లను పెవిలియన్ చేర్చాడు. ముఖ్యంగా ఒకే స్పెల్‌లో ఇంగ్లండ్ టాప్ ఆర్డర్‌ను బెంబేలెత్తించాడు. అతనికి మహమ్మద్ సిరాజ్ కూడా తోడవడంతో ఇంగ్లండ్ 123 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సిరాజ్ ప్రమాదకర ఓపెనర్ జాక్ క్రాలీని డకౌట్‌గా వెనక్కి పంపాడు.

తాజా సమాచారం అందేసరికి ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ (18), వికెట్ కీపర్ జేమీ స్మిత్ (22) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 485 పరుగులు అవసరం కాగా, భారత్ గెలుపు లాంఛనమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌లోనూ ఆకాశ్ దీప్ 4, సిరాజ్ 6 వికెట్లతో రాణించిన విషయం తెలిసిందే.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *