ప్రస్తుతం వినియోగదారులు డిజిటల్ చెల్లింపులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. చిన్న టీ కొట్టు నుంచి పెద్ద మాల్స్ వరకు ఎక్కడ ఏది కొనుగోలు చేసినా నగదు రహిత లావాదేవీలైన యూపీఐ చెల్లింపులనే వినియోగిస్తున్నారు.
ఈ లావాదేవీలు చేయడానికి ప్రస్తుతం కనీసం 30 సెకన్ల సమయం పడుతోంది. ఈ సమయాన్ని తగ్గించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్లో కొన్ని కీలక మార్పులు చేయనున్నట్లు ఎన్పీసీఐ ప్రకటించింది.
ఈ తాజా అప్డేట్ జూన్ 16 నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపింది. దీని ద్వారా యూపీఐ లావాదేవీలు మరింత సులభతరం అవుతాయి. ప్రస్తుతం ఆన్లైన్ చెల్లింపులకు 30 సెకన్ల సమయం పడుతుండగా, అది 15 సెకన్లకు పరిమితం కానుంది. లావాదేవీ స్థితిని తనిఖీ చేసే సమయాన్ని 30 సెకన్ల నుంచి 10 సెకన్లకు తగ్గించనున్నారు. దీనివల్ల డిజిటల్ చెల్లింపులకు సంబంధించి వినియోగదారులకు సమయం ఆదా అవుతుంది.