ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తానీ కళాకారుల ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలను మన దేశంలో నిషేధించింది. అంతేకాదు, యూట్యూబ్లో చాలా పాకిస్తానీ ఛానెళ్లను కూడా బ్లాక్ చేసింది. దీంతో చాలా మంది మదిలో ఓ ప్రశ్న తలెత్తింది. భారతదేశ ప్రభుత్వానికి ఎవరి సోషల్ మీడియా ఖాతానైనా బ్యాన్ చేసే అధికారం ఉందా? దీనికి సంబంధించి ఏమైనా ప్రత్యేక నియమాలు ఉన్నాయా ? ఒక సోషల్ మీడియా అకౌంట్ మూసివేయడానికి ఎలాంటి ప్రక్రియ ఉంటుంది పూర్తి వివరాలను తెలుసుకుందాం.
ప్రభుత్వం ఎవరి సోషల్ మీడియా ఖాతానైనా మూసివేసే అధికారం ఉందా.. సింపుల్గా సమాధానం చెప్పాలంటే.. లేదు. భారత ప్రభుత్వం తన ఇష్టానుసారం లేదా సరైన కారణం లేకుండా ఎవరి సోషల్ మీడియా అకౌంట్ మూసివేయలేదు. దీని కోసం ఒక చట్టపరమైన ప్రక్రియ ఉంది. కొన్ని నిర్దిష్ట నియమాలు ఉంటాయి. ఆ నియమాలను పాటించిన తర్వాత మాత్రమే ఎవరి అకౌంట్ అయినా క్లోజ్ చేస్తుంది లేదా సస్పెండ్ చేస్తుంది. భారత ప్రభుత్వానికి ఒక వ్యక్తి ఖాతా నుంచి దేశ భద్రతకు ముప్పు కలిగించే సమాచారం షేర్ చేస్తున్నారని అనిపిస్తే… లేదా ఒక అకౌంట్ నుండి నకిలీ వార్తలు వ్యాప్తి చేస్తున్నారని తెలిస్తే.. లేదా ఎవరి సోషల్ మీడియా ఖాతాలో చేసే పోస్ట్ల వల్ల ప్రజల శాంతికి భంగం కలిగితే వాళ్ల సోషల్ మీడియా అకౌంట్లను బ్యాన్ చేస్తుంది. లేదా ఏదైనా అకౌంట్ ఒక ప్రత్యేక వర్గాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తే.. లేదా అల్లర్ల సమయంలో అల్లర్లు మరింత పెరిగేలా పోస్ట్లు షేర్ చేస్తే.. లేదా ఏదైనా అకౌంట్ నుండి అసభ్యకరమైన, హింసాత్మకమైన లేదా చట్టవిరుద్ధమైన కంటెంట్ షేర్ చేస్తే.. అలాంటప్పుడు ప్రభుత్వం అలాంటి సోషల్ మీడియా ఖాతాను మూసివేయవచ్చు. అయితే దీనికి సరైన విచారణ, చట్టపరమైన ప్రక్రియ తప్పనిసరిగా ఉంటుంది.