- వెంకట్రావుపేట్ గేట్ వద్ద ఘటన.. భారీగా ఆస్తి నష్టం
నర్సాపూర్/కౌడిపల్లి (ప్రజాజ్యోతి) కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట్ గేట్ వద్ద శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఓ కిరాణం దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దుకాణం నుంచి పెద్ద ఎత్తున మంటలు, పొగ రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేశారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పివేశారు. అప్పటికే షాపులోని సరుకులు, సామాగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ప్రమాద సమయంలో దుకాణానికి తాళం వేసి ఉండటంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. సరుకులన్నీ అగ్నికి ఆహుతి కావడంతో యజమానికి భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
