నేపాల్‌పై గెలిచి… దర్జాగా సూపర్-8 లోకి ప్రవేశించిన వెస్టిండీస్

V. Sai Krishna Reddy
1 Min Read

టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ జట్టు అద్భుత ప్రదర్శనతో సూపర్ 8 దశకు అర్హత సాధించింది. ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన గ్రూప్-సి మ్యాచ్‌లో నేపాల్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బౌలింగ్‌లో, ఆ తర్వాత బ్యాటింగ్‌లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన కరీబియన్ జట్టు, ఈ టోర్నీలో నేపాల్ ప్రస్థానానికి ముగింపు పలికింది.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్‌కు కెప్టెన్ నిర్ణయం సరైనదని బౌలర్లు నిరూపించారు. జాసన్ హోల్డర్ (4/27) అద్భుత బౌలింగ్‌తో నేపాల్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా, దీపేంద్ర సింగ్ ఐరీ (47 బంతుల్లో 58) ఒంటరి పోరాటం చేసి హాఫ్ సెంచరీ సాధించాడు. చివర్లో సోంపాల్ కమీ (15 బంతుల్లో 26) వేగంగా ఆడటంతో నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులు చేయగలిగింది.

అనంతరం 134 పరుగుల సులభ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌కు ఓపెనర్ బ్రాండన్ కింగ్ (22) మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అతను ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన షిమ్రాన్ హెట్‌మెయర్ (32 బంతుల్లో 46 నాటౌట్), మరో ఓపెనర్, కెప్టెన్ షాయ్ హోప్ (44 బంతుల్లో 61 నాటౌట్)తో కలిసి విధ్వంసం సృష్టించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు అజేయంగా 91 పరుగులు జోడించడంతో విండీస్ కేవలం 15.2 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

విండీస్ కు ఇది వరుసగా మూడో విజయం కాగా, ఈ గెలుపుతో సూపర్ 8లో అడుగుపెట్టింది. మరోవైపు, ఆడిన మూడు మ్యాచ్ ల్లో ఓటములతో నేపాల్ టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *