తమిళనాడులో ఆధ్యాత్మిక మాసం మార్గళి పూజలకు తోడు, ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు తోడవడంతో పూల ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా మల్లెపూల ధరలు సామాన్యులకు అందనంత స్థాయికి చేరాయి. గురువారం మదురై మార్కెట్లో కిలో మల్లెలు రూ. 2,500 పలుకగా, తేని జిల్లా ఆండిపట్టి మార్కెట్లో ఏకంగా రూ. 3,000 మార్కును తాకాయి.
రాష్ట్రంలో వర్షాలు తగ్గి మంచు కురుస్తుండటంతో పూల దిగుబడి గణనీయంగా పడిపోయింది. ఇదే సమయంలో వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సరం వంటి సందర్భాల వల్ల పూలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. మల్లెపూలతో పాటు ఇతర పూల ధరలు కూడా పెరిగాయి. కిలో కనకాంబరం రూ. 2,500, ములై పూలు రూ. 1,200, పన్నీటి గులాబీలు రూ. 200 చొప్పున విక్రయించారు. సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో పూల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
