బైక్ టాక్సీ ప్లాట్ఫామ్ ర్యాపిడో ఫుడ్ డెలివరీ రంగంలోకి ప్రవేశించింది. ప్రస్తుతం రైడ్ సేవలు అందిస్తున్న ర్యాపిడో యాప్, వ్యాపార విస్తరణలో భాగంగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టింది. ఇందుకోసం ‘ఓన్లీ’ పేరుతో ఒక యాప్ను ప్రారంభించింది.
ప్రస్తుతం బెంగళూరులో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ నేపథ్యంలో వావ్, ఈట్ ఫిట్, క్రిస్పీ, క్రీం వంటి బ్రాండ్లతో ర్యాపిడో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఫ్లాట్ఫామ్పై చాలా వరకు ఆహార పదార్థాల ధరలు రూ.150 లోపే ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్లో జొమాటో, స్విగ్గీ ఫ్లాట్ఫామ్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విభాగంలో గట్టి పోటీ ఇచ్చేందుకు ర్యాపిడో సిద్ధమైంది. రెస్టారెంట్ల నుంచి కేవలం 8-15 శాతం కమీషన్ మాత్రమే వసూలు చేయడం ద్వారా ఈ రంగంలో రాణించాలని ర్యాపిడో భావిస్తోంది.
2015లో బైక్ ట్యాక్సీ ప్లాట్ఫామ్గా తన కార్యకలాపాలు ప్రారంభించిన ర్యాపిడో, ఒక దశాబ్ద కాలంలోనే దేశంలో రైడ్ షేరింగ్ రంగంలో రెండవ స్థానాన్ని ఆక్రమించింది. 500కు పైగా నగరాల్లో ర్యాపిడో సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే తన బైక్ సేవలను ఉపయోగించి వ్యక్తిగత రెస్టారెంట్లకు డెలివరీ సేవలను ర్యాపిడో అందిస్తోంది.