ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 8 ట్రాక్టర్ల ఇసుక ఉచితం

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త తెలిపారు. ఈ పథకం కింద ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న సహాయం గురించి వివరిస్తూ ఆయన ‘ఎక్స్’ వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు. “ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం 8 ట్రాక్టర్ల ఇసుకను ఉచితంగా అందించడంతో పాటు విడతల వారీగా రూ. 5 లక్షలు అందజేస్తున్నాం” అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇంటి నిర్మాణం 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోపు ఉండాలని ఆయన సూచించారు.

లబ్ధిదారులకు అవసరమైతే మహిళా సంఘాల ద్వారా లక్ష రూపాయల వరకు రుణం ఇప్పించే ఏర్పాటు కూడా ప్రభుత్వం చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. “పది సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత, ఇప్పుడు ప్రజా పాలన ప్రభుత్వంలో మళ్లీ ఇందిరమ్మ ఇళ్లు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలి” అని పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులందరికీ ఆయన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *