లాటరీలో రూ. 231 కోట్ల జాక్ పాట్ కొట్టిన చెన్నై వ్యక్తి

V. Sai Krishna Reddy
1 Min Read

అదృష్టం ఎప్పుడు, ఎవరి తలుపు తడుతుందో ఊహించడం కష్టం. ఒక్కోసారి చిన్న ప్రయత్నమే ఊహించని కానుకను అందించి, జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. సరిగ్గా ఇలాంటి ఘటనే చెన్నైకి చెందిన 56 ఏళ్ల శ్రీరాం రాజగోపాలన్ విషయంలో జరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నిర్వహించే ప్రతిష్ఠాత్మక ‘ఎమిరేట్స్ డ్రా మెగా7’ లాటరీలో ఆయన ఏకంగా 231 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని గెలుచుకుని, ఒక్కరాత్రిలోనే కోటీశ్వరుడిగా అవతరించారు.

వివరాల్లోకి వెళితే, వృత్తిరీత్యా రిటైర్డ్ ఇంజినీర్ అయిన శ్రీరాం రాజగోపాలన్, తన జన్మదినమైన మార్చి 16న సరదాగా ఎమిరేట్స్ డ్రా లాటరీ టికెట్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశారు. అప్పుడు ఆ టికెట్ తన జీవితాన్ని ఇంతలా మార్చేస్తుందని ఆయన కలలో కూడా ఊహించలేదు. మెగా7 లాటరీలో భాగంగా ఆయన యాధృచ్ఛికంగా ఏడు నెంబర్లను ఎంచుకున్నారు. ఆశ్చర్యకరంగా, ఆయన ఎంచుకున్న అవే నెంబర్లు జాక్‌పాట్‌ను తెచ్చిపెట్టాయి.

లాటరీ ఫలితాలు వెలువడినప్పుడు, తొలుత శ్రీరాం ఈ వార్తను నమ్మలేకపోయారు. “డ్రా వీడియోను రెండుసార్లు చూశాను. స్క్రీన్‌షాట్‌లు తీసుకున్న తర్వాతే ఇది నిజమని నమ్మకం కుదిరింది. దీని వెనుక ఎలాంటి లాజిక్ లేదు, ఇది పూర్తిగా అదృష్టమే” అని శ్రీరాం ఆనందంతో తెలిపారు. ఈ భారీ విజయం తన జీవితాన్ని ఒక్కరోజులోనే మార్చేసిందని ఆయన చెప్పారు.

“నా సమయం ఇప్పుడు వచ్చింది. ప్రతి ఒక్కరికీ జీవితంలో ఏదో ఒక సమయంలో అవకాశం వస్తుంది. ఆశను ఎప్పుడూ వదులుకోవద్దు, ఆటను ఆనందంగా, బాధ్యతాయుతంగా ఆడండి” అని సూచించారు. శ్రీరాంకు ఖాళీ సమయాల్లో ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయడం అలవాటు. ఆ ఆసక్తితోనే ఆన్‌లైన్ లాటరీ గురించి తెలుసుకుని, సరదాగా ఆడటం ప్రారంభించారు. అదే ఇప్పుడు ఆయనకు ఊహించని విజయాన్ని అందించింది. ఈ వార్త ప్రస్తుతం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *