హైదరాబాద్ నగరం ప్రతిష్ఠాత్మక ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్) పోటీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ అంతర్జాతీయ వేడుక కోసం వందకు పైగా దేశాల నుంచి అందాల భామలు భాగ్యనగరానికి తరలివస్తున్నారు. వారికి ఘన స్వాగతం పలికేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో, పోటీల నిర్వహణపై హైటెక్ సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
హైదరాబాద్ ప్రజలు ఆప్యాయతను పంచుతారు: నందిని గుప్తా
మిస్ ఇండియా నందిని గుప్తా మాట్లాడుతూ, తెలంగాణ గురించి ప్రస్తావించిన ప్రతిసారీ తనకు గొప్ప అనుభూతి కలుగుతుందని అన్నారు. ఈ ప్రాంత సంస్కృతి, అభివృద్ధి అద్భుతంగా ఉన్నాయని ఆమె ప్రశంసించారు. హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇక్కడి ప్రజలు ఎంతో ఆప్యాయతను పంచుతారని తెలిపారు. హైదరాబాదీ బిర్యానీ నుంచి ఇరానీ చాయ్ వరకు స్థానిక వంటకాలు అమోఘంగా ఉంటాయని ఆమె పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే ప్రతి యువతి ఒక ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని నందిని గుప్తా అభిప్రాయపడ్డారు.
రాష్ట్రానికి గర్వకారణమన్న మంత్రి జూపల్లి కృష్ణారావు
తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడం రాష్ట్రానికే గర్వకారణమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ పోటీల కోసం వస్తున్న ప్రతి ఒక్కరికీ మధురానుభూతిని అందించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మిస్ వరల్డ్ గ్లోబల్ యూనిట్కు తెలంగాణ వేదిక కావడం గర్వంగా ఉందన్నారు. రాష్ట్ర సంప్రదాయాలను, పర్యాటక ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఇదొక సువర్ణావకాశమని మంత్రి అభివర్ణించారు.
సామాన్యులకూ ప్రవేశం ఉంటుందన్న పర్యాటక శాఖ కార్యదర్శి
ఈ పోటీల ద్వారా తెలంగాణ ఆహారం, సంస్కృతి, పర్యాటక ఆకర్షణలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు వీలు కలుగుతుందని పర్యాటక శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. విదేశీ పర్యాటకులను ఆకట్టుకోవడానికి ఇదొక గొప్ప అవకాశమని పేర్కొన్నారు. అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేవలం వీవీఐపీలకే పరిమితం అనే భావన లేకుండా, సామాన్యులు కూడా ఈ అందాల పోటీలను వీక్షించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆసక్తి ఉన్నవారు పర్యాటక శాఖ అధికారిక వెబ్సైట్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.