వైద్యులు చేతులెత్తేస్తే ఏఐ ప్రాణం పోసింది

V. Sai Krishna Reddy
1 Min Read

అరుదైన వ్యాధితో మరణం అంచున ఉన్న ఒక అమెరికన్ పౌరుడికి కృత్రిమ మేధ (ఏఐ) పునర్జన్మ ప్రసాదించింది. వైద్యులు చేతులెత్తేసిన వేళ, వినూత్న వైద్యంతో ప్రాణాలను నిలబెట్టింది. అమెరికాలోని వాషింగ్టన్ లో చోటుచేసుకుందీ అద్భుతం. వైద్యరంగంలో ఏఐ ప్రాముఖ్యతను చాటి చెబుతోందీ ఘటన. అమెరికన్ వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జోసెఫ్ కోట్స్ అత్యంత అరుదైన పోయెమ్స్ సిండ్రోమ్ తో బాధపడుతున్నాడు. ప్రాణాంతకమైన ఈ వ్యాధి కారణంగా జోసెఫ్ శరీరంలో ఒక్కో భాగం చచ్చుబడిపోతోంది. కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. గుండె వ్యాకోచించింది. మూత్రపిండాలు ఫెయిలయ్యాయి. ఈ పరిస్థితిలో సంప్రదాయ వైద్యం పనిచేయడంలేదని, జోసెఫ్ ను రక్షించడం తమవల్ల కాదని వైద్యులు తేల్చి చెప్పారు.

అటు వైద్యులు, ఇటు జోసెఫ్ కుటుంబ సభ్యులు ఆశలు వదిలేసుకున్నారు. అయితే, జోసెఫ్ ప్రియురాలు తారా థెబాల్డ్ మాత్రం ఊరుకోలేదు. వైద్యరంగంలో కృత్రిమ మేధ సాయంపై పరిశోధన చేస్తున్న ఫిలడెల్ఫియా వైద్యుడు డాక్టర్ డేవిడ్ ను ఆశ్రయించింది. జోసెఫ్ పరిస్థితిని వివరిస్తూ సాయం చేయాలంటూ ఈమెయిల్ పంపింది. ఈ వివరాలతో డాక్టర్ డేవిడ్ కృత్రిమ మేధ సాయాన్ని అర్థించారు. ఏఐ సూచనలతో జోసెఫ్ ట్రీట్ మెంట్ మార్చాలని వైద్యులకు సూచించారు.

కీమోథెరపీ, ఇమ్యునోథెరపీలతో పాటు స్టెరాయిడ్స్ ఇస్తూ చికిత్స చేయాలని ఏఐ పేర్కొంది. ఈ సూచనలు పాటించి వైద్యం చేయగా వారం రోజులకే జోసెఫ్ ఆరోగ్యం మెరుగుపడడం గమనించామని ఆయనకు చికిత్స చేస్తున్న వైద్యులు తెలిపారు. నాలుగు నెలల చికిత్స తర్వాత జోసెఫ్ ఆరోగ్యం మరింత మెరుగుపడిందని, స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంట్ చేసేందుకు అనువుగా మారిందని పేర్కొన్నారు. ఏఐ సూచించిన వైద్య విధానమే జోసెఫ్ కోలుకునేలా చేసిందని తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *