ఏఐ రంగంలో టీసీఎస్ భారీ ముందడుగు.. టీపీజీతో కలిసి రూ.18,000 కోట్ల పెట్టుబడి

V. Sai Krishna Reddy
1 Min Read

దేశీయ ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో మరో కీలక ముందడుగు వేసింది. ఏఐ డేటా సెంటర్ వ్యాపారాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ‘హైపర్‌వాల్ట్‌’ పేరుతో ఏర్పాటు చేయనున్న ఈ వెంచర్‌లో రెండు సంస్థలూ కలిసి ఏకంగా రూ.18,000 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నాయి.

ఈ ఒప్పందంలో భాగంగా, టీపీజీ సంస్థ రూ.8,870 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా కొత్తగా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ కంపెనీలో టీపీజీకి 27.5 శాతం నుంచి 49 శాతం మధ్య వాటా లభించనుంది. ఈ భారీ పెట్టుబడులతో అత్యాధునిక ఏఐ సాంకేతికతకు అవసరమైన మౌలిక సదుపాయాలను నిర్మించనున్నారు.

ఈ భాగస్వామ్యంపై టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ స్పందించారు. ‘హైపర్‌వాల్ట్‌’ డేటా సెంటర్ ద్వారా తమ కస్టమర్లకు, భాగస్వాములకు సంపూర్ణమైన ఏఐ సొల్యూషన్లను అందించగలమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఏఐ ఆధారిత సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ను అందిపుచ్చుకోవడంలో ఈ కొత్త వెంచర్ కీలక పాత్ర పోషిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *