ప్రతి భారతీయుడి బాగు కోసం శ్రీశైలంలో ప్రార్థించాను: ప్రధాని మోదీi

V. Sai Krishna Reddy
2 Min Read

ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. దేశ ప్రజలంతా సుఖసంతోషాలతో, మంచి ఆరోగ్యంతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి ప్రధాని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నంద్యాల జిల్లాలోని శ్రీశైలం క్షేత్రానికి చేరుకున్న ప్రధాని మోదీకి ఆలయ అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం ప్రధాని వివిధ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రం యొక్క విశిష్టతను, చారిత్రక ప్రాముఖ్యతను అర్చకులు ప్రధానికి వివరించారు. అనంతరం ప్రధాని తన పర్యటనకు సంబంధించిన ఫోటోలను ‘ఎక్స్’ ఖాతాలో పంచుకున్నారు.

ఈ పర్యటనతో శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న నాలుగో భారత ప్రధానిగా నరేంద్ర మోదీ నిలిచారు. గతంలో జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు ఈ ఆలయాన్ని సందర్శించారు. ప్రధానిగా మోదీ శ్రీశైలానికి రావడం ఇదే తొలిసారి.

ఆలయ దర్శనం తర్వాత ప్రధాని మోదీ శ్రీశైలంలో ఉన్న శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. 1677లో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ క్షేత్రాన్ని సందర్శించిన దానికి గుర్తుగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి ధ్యాన మందిరాన్ని, శివాజీ విగ్రహాన్ని ప్రధాని పరిశీలించారు. కేంద్రం నిర్వాహకులు దాని ప్రాముఖ్యతను మోదీకి వివరించారు.

అంతకుముందు కర్నూలు విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ రాష్ట్రంలో పరిశ్రమలు, విద్యుత్, రోడ్లు, రైల్వేలు, రక్షణ, పెట్రోలియం వంటి పలు రంగాలకు చెందిన సుమారు రూ.13,430 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. నన్నూరు గ్రామంలో ఏర్పాటు చేసిన జీఎస్టీ సంస్కరణలపై జరిగే బహిరంగ సభలో కూడా ఆయన ప్రసంగించనున్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *